
- నాగర్ కర్నూల్ జిల్లా మన్నెవారిపల్లి నుంచి షురూ
- అవుట్ లెట్ నుంచి పనులు చేసేందుకు రాడార్ సర్వే
అచ్చంపేట, వెలుగు: ఎస్ఎల్ బీసీ సొరంగం పనులను త్వరలో మళ్లీ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నాగర్కర్నూల్జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి నుంచి ప్రారంభించనుంది. గత ఫిబ్రవరి 22న అమ్రాబాద్మండలం దోమలపెంట వద్ద ఎస్ఎల్ బీసీ సొరంగం పనుల్లో ప్రమాదం జరిగి 8 మంది చనిపోవడంతో పనులు నిలిచిపోయాయి. దోమలపెంట నుంచి పనులు చేపట్టడం సాధ్యం కాకపోవడంతో మన్నెవారిపల్లి అవుట్ లెట్ నుంచి చేసేందుకు ప్రభుత్వం సర్వే చేస్తుంది.
ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ తో రాడార్ సర్వేకు శ్రీకారం చుట్టింది. ఎస్ఎల్బీసీ ఘటనకు సంబంధించిన సహాయక చర్యలు నిలిపివేసే సమయంలోనే 3 నెలల తర్వాత సొరంగం పనులు కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీ పర్యటన నుంచి తిరిగొచ్చిన మంత్రి ఉత్తమ్ కేంద్రం సహకారంతో నేషనల్ జియోలాజికల్ రిసోర్స్ ఆఫ్ ఇండియా టీమ్, నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి సొరంగం కూలిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఎస్ఎల్బీసీ సొరంగంపై భాగంలో ప్రమాదం జరిగిన 14 కిలోమీటరు వద్ద నుంచి ప్రొఫెసర్ తివారి ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర వైమానిక దళం సహకారంతో మరోసారి సర్వేను చేపట్టింది.
సర్వేలో డెన్మార్క్ కు చెందిన ఎలక్ట్రో మ్యాగ్నటిక్ పరికరాలను వినియోగిస్తూ.. ప్రమాద స్థలంలోని భూమి పొరలు, షీర్ జోన్ల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మన్నెవారిపల్లి, అమ్రాబాద్ మండలం నల్లవాగు, మల్లెలతీర్థం ప్రాంతాల్లో సర్వే పనులు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రెండు రోజుల నుంచి మన్నెవారిపల్లి ప్రాంతంలో సర్వే నిర్వహిస్తున్నారు.